telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. ఇంటి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తల నిరసన గురించి తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా చంద్రబాబు నివాసానికి తరలివస్తున్నారు.

అయితే, వైసీపీ గూండాలు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంట్లోకి చొరబడిన వారిని అడ్డుకుంటే.. టీడీపీ నేతలపై రాళ్లు విసిరారని మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి.. బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను పోలీసులు తోసేశారని, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు.

Related posts