నేడు హైకోర్టు లో ఎర్రమంజిల్ భవనం కూల్చివేత అంశంపై వాదనలు జరిగాయి. పాత రాష్ట్రాలే కొత్తగా అసెంబ్లీలు నిర్మించుకున్నాయన్న ధర్మాసనం.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రధానంగా ఎర్రమంజిల్లో భవనాలు వారసత్వ కట్టడాల పరిధిలోనే ఉన్నాయని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నళిన్ కుమార్ వాదించారు. ఈ వాదనలు కొనసాగుతున్న సందర్భంలో హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం అవసరాలకు సరిపోవడంలేదని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త అసెంబ్లీ నిర్మిస్తామని అంటోంది. ఈ తరుణంలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే తప్పేంటి? ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. కొత్తగా అసెంబ్లీ భవనం ఎందుకు నిర్మించుకోకూడదు? అని ప్రశ్నించింది.
తాము కొత్త అసెంబ్లీ భవనం నిర్మించడంపై ప్రశ్నించడంలేదని.. ఎర్రమంజిల్లో ఉన్న చారిత్ర భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతున్నామన్నారు నళిన్కుమార్. పురాతన కట్టడాల బాధ్యత ప్రభుత్వానిదని రాజ్యాంగం చెబుతోందని.. గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. మరోవైపు, హెచ్ఎండీఏ చట్టంలో ఉన్న నిబంధన 13ను తొలగించినందున ప్రస్తుతం అది వారసత్వ కట్టడాల పరిధిలోకి రాదని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. అసలు హెచ్ఎండీఏకు వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న వాటిని తొలగించడం.. కొత్తవి చేర్చడం వంటి అధికారం ఉందో, లేదో చెప్పాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.