ఆహారం అంటే పిజ్జా, బర్గర్ అనే స్థాయికి వెళ్ళాము. కానీ వాటితో అనారోగ్యం తప్పటం లేదని తెలుసుకున్నాం. మరి ప్రత్యామ్న్యాయం ఏమిటని ఒక్కసారి పెద్దల ఆహారం పరికిస్తే, అందులో ప్రధానంగా ఉన్నవి గింజజాతి ఆహారం. దానితో ఏది సరైన ఆహారంలో తెలిసింది. అందుకే ఇప్పుడు అందరు ఆ తరహా ఆహారాన్నే తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ప్రధానంగా, అవిసె గింజలను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, జీర్ణ సమస్యలు పోతాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. అలాగే అవిసె గింజలను రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం అనే ఓ జర్నల్లో అధ్యయన వివరాలను ప్రచురించారు.
అవిసె గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గించడమే కాక, శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ను తగ్గిస్తాయి. డయాబెటిస్ను అదుపులో ఉంచుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. హైబీపీ తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం గుప్పెడు అవిసె గింజలను తింటుంటే పైన ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చని సైంటిస్టులు నొక్కివక్కాణిస్తున్నారు.