ఆర్టీసీలోని ప్రధాన యూనియన్ అయిన ‘తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)’ గౌరవాధ్యక్ష పదవికి మాజీమంత్రి టి.హరీశ్రావు గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డికి పంపినట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక యూనియన్ ఉండాలనే ఉద్దేశ్యంతో టీఎంయూ నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీష్రావు టీఎంయూ గౌరవాధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతరత్రా అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున, ఆర్టీసీ కార్మిక యూనియన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం సాధ్యపడటం లేదు. ఈనేపథ్యంలో టిఎంయు బాధ్యతల నుంచి తప్పుకోవాలనే హరీష్రావు భావించారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని ఈసందర్బంగా హరీష్రావు పేర్కొన్నారు.