గతంలో భారత క్రికెట్ డ్రెస్సింగ్రూమ్ విమర్శలకు కేంద్ర బిందువుగా ఉండేది. కానీ ఇప్పుడు సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ స్థానం ఆక్రమించినట్టు కనిపిస్తోంది. అనుభవం లేని సెలక్షన్ ప్యానల్పై మాజీ క్రికెటర్లు వరుసగా విమర్శలు సంధిస్తున్నారు. యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మ్యాచ్ అవకాశం దక్కకుండానే వేటు వేయటంపై టర్బోనేటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. సెలక్షన్ కమిటీ సంజూ శాంసన్ హృదయాన్ని పరీక్షిస్తున్నట్టు కనిపిస్తోంది. సెలక్షన్ కమిటీని మార్చాల్సిన అవసరం ఉంది. అక్కడ బలమైన వ్యక్తులు ఉండాలి. ఆ దిశగా సౌరభ్ గంగూలీ ఏదో ఒకటి చేస్తారనే విశ్వాసం ఉందని భజ్జీ ట్వీట్ చేశాడు.
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశి థరూర్ ట్విటర్లో సెలక్షన్ ప్యానల్పై విమర్శనాస్త్రం ఎక్కుపెట్టాడు. ఒక్క అవకాశం దక్కకుండానే సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించటం నిరుత్సాహానికి గురి చేసింది. సంజూ మూడు టీ20లకు శీతల పానియాలు మోసాడు. అతడిని పూర్తిగా విస్మరించారు. సెలక్షన్ కమిటీ సంజూ బ్యాటింగ్ను పరీక్షిస్తుందా? లేక అతడి హృదయాన్నా? అని థరూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కే హర్బజన్ సింగ్ బదులిచ్చారు. ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరంజిపె, శరణ్దీప్ సింగ్, గగన్ ఖోడాలతో కూడిన సీనియర్ సెలక్షన్ కమిటీ అనుభవంపై ఆది నుంచీ బలమైన విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. నాలుగేండ్ల కాలం ముగియటంతో కొత్త సెలక్షన్ కమిటీపై దాదా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.