telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గుజరాత్‌ సీఎంకు కరోనా వైద్య పరీక్షలు!

gujarat govt decreased penalty to public

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడ్వాలా నిన్న కలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో సదరు ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ రూపానీకీ ఈ రోజు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న గుజరాత్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడ్వాలాకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆ సమావేశానికి హాజరైన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు.

ఇమ్రాన్‌ ఖేడ్వాలా విజయ్ రూపానీని తాకనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని గుజరాత్‌ ప్రభుత్వాధికారులు అంటున్నారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 615 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వారిలో 59 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 28 మంది మృతి చెందారు.

Related posts