బెంగుళూరులో కార్యకర్తలు జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు ఘనస్వాగతం పలికారు. అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల మాలలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 250 కేజీల యాపిల్ పండ్లతో తయారు చేసిన భారీ దండను క్రేన్ సహాయంతో గాల్లోకి లేపి ఆయనకు అలంకరించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కేపీసీసీ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి శివకుమార్ ప్రసంగించారు.
మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సెప్టెంబరు 3న డీకే ని అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో డీకే ట్రబుల్ షూటర్గా పేరు పొందారు. ఢిల్లీ హై కోర్టు ఆయనకు బుధవారం అక్టోబరు 23న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన 57 ఏళ్ల శివకుమార్ కు బెంగళూరు రూరల్, రామనగర, మాండ్య ప్రాంతాల్లో గట్టి పట్టుంది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతాల్లలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేశారు.