త్రిపురలోని అధికార బీజేపీ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ సంస్థకు దారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. 20 పాఠశాలలతో పాటు మూతపడిన 13 విద్యాసంస్థల నిర్వహణను ఇస్కాన్కు అప్పగించినట్లు విద్యాశాఖ మంత్రి రతన్లాల్నాథ్ శుక్రవారం పేర్కొన్నారు. విద్యార్థులు లేకపోవడంతో 13 సంస్థలను మూసివేశామని, మరో 147 ప్రభుత్వ పాఠశాలల్లో గరిష్టంగా పదిమంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని రతన్లాల్ తెలిపారు. వీటిల్లో 20 పాఠశాలలు, మూతపడిన 13 సంస్థలు, గరిష్టంగా పదిమంది విద్యార్థులు ఉన్న మరో ఏడు పాఠశాలలను ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియన్సెస్ (ఇస్కాన్) అప్పగించేందుకు గురువారం సాయంత్రం జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘ఇండియన్ ట్రైబల్ కేర్ ట్రస్ట్’ ఇస్కాన్లో ఒక విభాగమని, ఇది పాఠశాలలను నడుపుతుందని, ఇవన్నీ మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు.
గతేడాది బీజేపీ-ఐపిఎఫ్టి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇస్కాన్ 53 పాఠశాలలను ఇవ్వాలని కోరిందని, దక్షిణ త్రిపురలోని ఏడు పాఠశాలలను ఐదేళ్లపాటు ఇస్కాన్కు ఇచ్చేందుకు అంగీకరించామని మంత్రి తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఇస్కాన్తో అవగాహనా ఒప్పందం (ఎంఒయు) చేసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తుందని అన్నారు. త్రిపురలో మొత్తం 4,389 ప్రభుత్వ, ప్రభుత్వసహకారంతో నడుస్తున్న పాఠశాలలు ఉన్నట్లు రతన్లాల్ తెలిపారు. మెరుగైన రవాణా కోసం అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్ (ఎఎమ్సి) ప్రాంతాల్లో మీటర్ ఆటోరిక్షాల సేవలను, పట్టణ బస్సు సేవలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు రతన్ తెలిపారు.