ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఊరట లభించింది. పదవీ విరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలు కల్పించింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈపీఎఫ్వో దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్ దీపక్గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఇకనుంచి ఉద్యోగులు పదవీ విరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్ పింఛను లెక్కించేందుకు మార్గం సులభతరమైంది.
అధిక పింఛను కోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. . ఈ తీర్పుతో ఈపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు వారు పొందుతున్న వేతనాల మేరకు పింఛను లభించనుంది. ఈపీఎఫ్వో చట్టం ప్రకారం ఉద్యోగి వేతనం రూ.6,500 కంటే ఎక్కువగా ఉంటే, ఆ వేతనంపై ఈపీఎస్ చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ఇక ఉద్యోగి వాస్తవిక మూలవేతనం, డీఏ కలిపి పింఛను గరిష్ఠ అర్హత వేతనంగా నిర్ణయించాలి. ఆ ఉద్యోగి సర్వీసు ఆధారంగా పింఛను లెక్కించాలి. ఒకవేళ ఉద్యోగి 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే వారికి అదనంగా మరో రెండేళ్ల సర్వీసు కలిసి వస్తుంది.