ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు, ఘటనపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి పయనమయ్యారు. కాగా, సహాయ చర్యల కోసం రాజమండ్రి నుంచి హెలికాప్టర్ బయల్దేరింది.ఈ ఘటనలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు భావిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటు ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.