వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది. హైకోర్టు తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన నాలుగు అంశాలు..
* హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరిన జీహెచ్ఎంసీ.
* ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరిన జీహెచ్ఎంసీ.
* సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని జీహెచ్ఎంసీ వినతి.
* హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరిన జీహెచ్ఎంసీ.
హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు నగరం పరిధిలో లేవని జీహెచ్ఎంసీ తన పిటిషన్లో కోర్టుకు వివరించింది.
నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది.కరోనా కట్టడికి మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా విగ్రహాలు ఆపితే వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాలంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపును కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.