నేడు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పట్టాభిషేఖం జరగనుంది. బుధవారమే ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ వేయని నేపథ్యంలో అతను బోర్డు పగ్గాలు చేపట్టడం లాంఛనమే. 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. కమిటీ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ తమ పదవీ కాలానికి తలో రూ.3.5 కోట్లు జీతం తీసుకుంటున్నట్లు వెల్లడైంది.
సౌరభ్ గంగూలీ ధోని అంతర్జాతీయ కెరీర్ విషయమై తనతో ఇంతవరకు ఏమీ మాట్లాడలేదని విరాట్ కోహ్లి అన్నాడు. తాను అధ్యక్ష పదవి చేపట్టాక ధోని భవిష్యత్ గురించి అతడితో, సెలక్టర్లతో మాట్లాడతానని గంగూలీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం గొప్ప విషయం. అతణ్ని అభినందించాను. కానీ ధోని గురించి తనతో ఇంకా ఏమీ మాట్లాడలేదు. నాతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్లి కలుస్తానని దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం కోహ్లి చెప్పాడు.