బీసీసీఐ అధ్యక్షు పదవీ అధిరోహించిన తరువాత సౌరవ్ గంగూలీ రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న పనులన్నీ సెరవేగంతో పూర్తిచేయాలన్న సంకల్పంతో కనిపిస్తున్నారు. బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), దాని అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించారు. చిన్నస్వామి స్టేడియంలో ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్తో బుధవారం భేటీ అయ్యారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ఆయనతో చర్చించారు. జాతీయ క్రికెట్ అకాడమీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. సమావేశం తర్వాత వీరంతా కలిసి నగరంలో కొత్తగా ఎన్సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు.
అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన అకాడమీ కోసం కర్ణాటక ప్రభుత్వం నుంచి బీసీసీఐ మరో 15 ఎకరాల భూమిని సేకరించింది. ఈ ఏడాది మే నెలలో మరో 26 ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఎన్సీఏకు 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన సౌకర్యాలతో ఎన్సీఏను నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుత అకాడమీ ఆటగాళ్లు గాయపడ్డప్పుడు విశ్రాంతి కేంద్రంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.