నరసరావుపేట కొవిడ్ సమీక్షలో కలెక్టర్ కు డాక్టర్ కు మధ్య వాగ్వివాధం జరిగింది. నిర్భయంగా సమస్యల గురించి ప్రస్తావించిన డాక్టర్ సోమ్లా నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఘాటుగా స్పందించారు. డాక్టర్ సోమ్లా నాయక్ అరెస్ట్ ను ఖండిస్తున్నానని తెలిపారు. కరోనాను నియంత్రించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలకు డాక్టర్లను నిందిస్తుండడం పట్ల డాక్టర్ సోమ్లా నాయక్ ప్రశ్నించాడని తెలిపారు.
సమీక్షలో ప్రశ్నించిన ఆ డాక్టర్ ను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడానికి బదులుగా ప్రభుత్వం ఇదేమిటని ప్రశ్నిస్తున్న వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని గల్లా జయదేవ్ ఆరోపించారు.