పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దుపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ఆయన ఈ అంశాన్ని గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో లేవనెత్తారు. దీనిపై సమాధానంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. టెండర్ల రద్దు ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా పడుతుందని చెప్పారు. టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఈ ప్రాజెక్టులో నామినేషన్ ప్రాతిపదికపై నవయుగ, బెకం సంస్థలకు అప్పజెప్పిన టెండర్లను రద్దు చేసేందుకు రాష్ట్ర జలవనరులశాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. నామినేషన్ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. అయితే ఈ పనులను అప్పగించేందుకు కొత్తగా పిలవనున్న టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనవచ్చని చెప్పారు. పనులు వేగంగా చేయకపోవడం, ఇతరత్రా వేరే కారణాలతో ఈ సంస్థను తొలగించనందున పోలవరం ప్రాజెక్టుకు తాజాగా పిలిచే టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.