కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి కూడా భారీ నిధులు మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పర్యావరణ భవన్లో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ హాజరయ్యారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ చట్టం (కంపా) కింద తెలంగాణకు కేంద్రం రూ.3,110 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అడవులను వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు చేయడానికి అవసరమైన పథకాలపై సమావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి కూడా నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.