మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శనివారం రాజీనామా లేఖను పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో ప్రకటించారు. అలాగే ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆమె శనివారం సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్లో జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా పేరొందిన అన్నపూర్ణమ్మ 1994, 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో 2018 ఎన్నికల్లో పోటీకి ఆమె దూరంగా ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జీగా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్ కూడా తన పదవిని వీడారు. ఈరోజు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో తన తల్లితో కలిసి ఆయన బీజేపీలో చేరనున్నారు.
అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు..సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు