telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

హైదరాబాద్ : ఆహార విప్లవంలో .. ఆరోగ్యకరమైన మామిడి లభ్యత..

food revolution in telangana returns best

తాజా ప్రభుత్వంతో, రాష్ట్రంలో ఆహార విప్లవానికి అడుగులు పడ్డాయి. రైతులు పండించిన పంటలు ఆన్ డిమాండ్‌పై అమ్ముకొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఆహారశుద్ధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మామిడి సీజన్ కావడంతో తొలిసారిగా మహిళా రైతులతో మామిడి కొనుగోళ్లు చేయించి, వాటిని సహజసిద్ధంగా మాగపెట్టి, వినియోగదారులకు చేర్చుతున్నారు. ఇందుకోసం నిత్యావసర వస్తువుల విక్రయ సంస్థ రత్నదీప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నది. తొలి విడుతలో మామిడి సేకరణను ప్రారంభించిన సంఘాలు.. ఆ తర్వాత పసుపు సేకరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మామిడి సేకరణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఆహారశుద్ధి కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఎంపికచేసిన మండలాలకు చెందిన సిబ్బందికి, రైతులకు సంగారెడ్డి జిల్లాలోని ఉద్యాన వర్సిటీలో పలుదఫాలుగా శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం రూ. 50 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. సేకరణలో భాగంగా మామిడి తెంపేందుకు కూలీలు, పెట్టెలు, కట్టర్, ఇతర సామగ్రి, శిక్షణ కోసం నిధులు వెచ్చించారు.

జాతీయ విపణిలో రాష్ట్రంలోని జగిత్యాల, కొల్లాపూర్ మామిడి రకాలకు మంచి డిమాండ్ ఉంది. జగిత్యాల, మహబూబ్‌నగర్ నుంచి ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తున్నారు. రైతులు అక్కడకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో ధర చెల్లింపు దళారుల ఇష్టారాజ్యంగా మారింది. రైతుల నుంచి అగ్గువకు కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. జగిత్యాల తదితర ప్రాంతాలకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు వచ్చి ఈ రెండు నెలలు మకాం వేస్తారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రభుత్వం చొరవ తీసుకొని మామిడి సేకరణను చేపట్టడం సత్ఫలితాలనిస్తున్నది.

సంఘాలలో సభ్యులుగా రైతుకుటుంబాల్లోని మహిళలను ఎంపిక చేశారు. వారితో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో 15 నుంచి 20 మంది సభ్యులుంటారు. ఈ సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించి ఎంపిక చేసిన మండలాల్లో మామిడి కొనుగోళ్లు ప్రారంభించారు.

గిట్టుబాటు ధర దక్కడంతో పాటు మహిళా సంఘాలకు కమీషన్ ద్వారా ఆదాయం సమకూర్చడం, వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులను అందించటమే లక్ష్యంగా వీటిని రూపొందించారు. మామిడి ప్రాసెస్ బాధ్యత ఐకేపీ ఉద్యోగులకు అప్పగించారు. ఈ ప్రక్రియలో రైతులకు గిట్టుబాటు ధర తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. ఇప్పటి వరకే ఏ గ్రేడ్ మామిడి పండ్లకు వ్యాపారులు రైతులు చెల్లించింది రూ. 20 లోపు మాత్రమే. రైతు ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో రూ. 35 నుంచి రూ.40 వరకు చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేయడం విశేషం. ఒక్కో టన్నుకు రూ. 15 వేలకు పైబడి గిట్టుబాటు ధర కల్పించారు.

ఈ విధానం అమలు వలన రైతుకు కిలోకు రూ. 15 వరకు అదనపు ఆదాయం వచ్చింది. ఉత్పత్తిదారుల సంఘాల్లోని సభ్యులు కూడా రైతులే కావటంతో ఆ కుటుంబాలకు కమీషన్ రూపంలో కూడా లాభం వచ్చింది. మామిడిపై రైతు ఉత్పత్తిదారుల సంఘాలు 4 శాతం వరకు కమీషన్ తీసుకుంటాయి. ఈ కమీషన్ నుంచే రైతు వద్ద సేకరించిన పండ్ల రవాణా, గోదాము కిరాయి, రైపెనింగ్ ఛాంబర్ అద్దెతోపాటు ఇతరత్రా ఖర్చులకు వినియోగించనున్నారు.

Related posts