ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలో మొదటగా మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. చైనాలో మొదటి కరోనా పేషంట్ కోలుకోవడం.. ఆశ్చర్యకరమైన అంశాలను ఆమె వెల్లడిస్తుండంతో ప్రపంచం ఇపుడు ఆశ్చర్యానికి గురి అవుతోంది. దాదాపు 199 దేశాలను హడలెత్తిస్తోన్న ఈ వైరస్ చైనాలోని వన్య ప్రాణుల నుంచే మానవులకు సంక్రమించినట్టుగా భావించారు. అయితే… ఇపుడు చైనాలో నమోదైన తొలి కరోనా కేసు బాధితురాలు చెబుతున్న అంశాలు మాత్రం ఈ వైరస్ జలచరాల నుంచే వ్యాపించిందన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మొట్టమొదటి కరోనా బాధితురాలు ఉహాన్లోని సీ ఫుడ్ మార్కెట్లో రొయ్యలు విక్రయిస్తూ ఉంటుంది. ఆమె డిసెంబర్ పదిన దగ్గు జ్వరం జలుబుతో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అయినా జబ్బు ఏ మాత్రం తగ్గలేదు. మరో ఆసుపత్రికి వెళ్లినా అదే పరిస్థితి.. ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. దీంతో ఉహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేరగా, అప్పటికే ఆమెకు ఉన్న లక్షణాలతోనే చాలా మంది ఆ సీ ఫుడ్ మార్కెట్ విక్రేతలు ఆ హాస్పటిల్కు క్యూలు కట్టారు.
అలా పేషంట్ల సంఖ్య వందలు, వేలకు చేరుతున్న క్రమంలోనే దాన్ని కరోనా వైరస్ కోవిడ్-19గా గుర్తించారు. వెంటనే క్వారంటైన్ చర్యలకు దిగారు. వైద్య పరీక్షల్లో ఇది ప్రాణాంతక వైరస్గా గుర్తించి ఆ సీ ఫుడ్ను మూసేశారు. మార్కెట్లోని ఓ టాయిలెట్ను ఉపయోగించిన సందర్భంగా తనకు ఈ వైరస్ సోకినట్టు తొలి పెషెంట్ చెబుతోంది. కోవిడ్-19ను తొలుత గుర్తించిన తొలి 27 మందిలో 24 మంది అదే మార్కెట్ నుంచి వచ్చారు. రెండు నెలల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు. ఆమె కోలుకునే సమయానికి చైనా సహా ప్రపంచంలోని చాలా దేశాలకు కరోనా విస్తరించింది. దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేసింది. చాలా దేశాల్లో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది కోవిడ్-19తో ఇప్పటికీ బాధపడుతున్నారు. కరోనా వైరస్ రేపిన కలవరం మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. అయితే ఈ వైరస్ వ్యాప్తిపై చైనా మొదట్లోనే స్పందించి ఉంటే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కావని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఈ వైరస్ అలుగు వంటి చిన్న వన్యప్రాణి ద్వారా వ్యాపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 33 వేలు దాటిన సందర్భంలో పాజిటివ్ బాధితుల సంఖ్య 8 లక్షలకు చేరుతోంది.