గుర్తుతెలియని దుండగులు న్యూజిలాండ్ నగరంలోని రెండు మసీదుల్లో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే మస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. తొలుత ఓ వ్యక్తి నల్లరంగు దస్తులు ధరించి అల్ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో 27 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనా సమయంలో అల్ నూర్ మసీదులో దాదాపు 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మసీదులో చాలా మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాలకే లిన్వుడ్ మసీదులో మరో ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మసీదు వద్ద పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.