అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పెన్నా సిమెంట్ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలో బొగ్గును వేడి చేసే బాయిలర్ వద్ద ఉష్ణోగ్రత అధికమై ఈ ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన కర్మాగారం యాజమాన్యం వెంటనే క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న కార్మికుల సంబంధీకులు కర్మాగారం వద్దకు చేరుకుని.. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు కర్మాగారం వద్దకు చేరుకుని వారితో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.