మరాఠీ సినీ నిర్మాత, మాజీ ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) సభ్యుడు సదానంద్ అలియాస్ పప్పూ లాడ్ ముంబైలోని ఎంఎస్ అలీ రోడ్డులో ఉన్న లాండాంచా గణపతి దేవాలయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ముంబైలో తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు పప్పూ లాడ్. గిర్గాంలోని తన ఇంటికి దగ్గరలో ఉండే గణపతి ఆలయానికి ప్రతిరోజూ వెళ్లేవారు.
బుధవారం కూడా అలాగే ఆలయానికి వెళ్లి, దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత ఆలయ పూజారితో కాసేపు మాట్లాడి పక్కన ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లారు. కొంచం సమయం తరువాత పూజారి గదిలోకి వెళ్లి చూడగా పప్పులాడ్ ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించారు. అప్పటికే ఆయన మరణించడంతో పోలీసులకు సమాచారం అందించారు పూజారి.
ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులకు సూసైడ్ నోట్ కన్పించింది. అందులో తనను ఓ బిల్డర్ తీవ్రంగా వేధిస్తున్నాడని, అతని వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు అందులో ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఎల్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు మరాఠీ సినిమాలను నిర్మించారు పప్పూ లాడ్.