పుల్వామా ఆత్మాహుతి దాడి అందరిని కలచివేస్తుంది. రెండవ అతిపెద్ద ఆత్మాహుతి దాడి కావటంతో దాని ప్రభావం తీవ్రంగానే భారతీయులపై పడింది. ముష్కరులను ఉపేక్షించవద్దని దేశవ్యాప్తంగా డిమాండ్లు, నిరసనలు వెల్లువెత్తాయి. మరోపక్క దేశవ్యాప్తంగా ప్రజలు కొవ్వొత్తులతో అమరులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటన ప్రభావంతో ఒక వ్యాపారి తన కూతురి పెళ్లి విందును రద్దు చేసుకొని ఆ మొత్తాన్ని అమరుల విరాళంగా అందజేశారు. ఆ స్థాయిలో దేశాన్ని ప్రభావితం చేసింది ఈ ఘటన. ఇప్పటికైనా భారత ప్రభుత్వం ముష్కరులపై తగిన చర్యలు తీసుకుంటుందో.. రాజకీయం చేస్తుందో చూడాలి.
సూరత్కు చెందిన దేవాషి మానెక్ వజ్రాల వ్యాపారి. ఆయన కుమార్తె అమీ పెళ్లి శుక్రవారం జరిగింది. వివాహం అనంతరం నిర్వహించాల్సిన పెళ్లి విందును రద్దు చేసిన దేవాషి.. సీఆర్పీఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున మరణించడంతో కలత చెంది, విందు కోసం ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రూ.11 లక్షలను అమరుల కుటుంబాలకు, మరో రూ. 5 లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ప్రకటించారు. దేవాషి నిర్ణయం విని పెళ్లికి వచ్చిన అతిథులు అభినందించారు. అంతేకాదు, పెళ్లిని కూడా చాలా సింపుల్గా, అట్టహాసం లేకుండా నిర్వహించడంలో అతిథులు సహకారం అందించారు.