ఆర్టికల్ 370 రద్దు పై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ పునర్విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమైందని అన్నారు. జమ్మూకశ్మీర్ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ ప్రజలను జైలుకు తరలిస్తున్నారని మండిపడ్డారు. నా రాష్ట్రం దహనమైపోతుంటే..ప్రజలు జైలుకెళ్తుంటే ఇంట్లో ఎందుకుండాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది భారతదేశం కాదనిపిస్తోందన్నారు.
జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఫరూఖ్ అబ్దుల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మా తలుపులు తెరచుకుంటాయని అన్నారు. వెంటనే ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ విషయం పై కోర్టుకెళ్తామని వ్యాఖ్యానించారు. మేం శాంతియుత తీర్మానాలను విశ్వసిస్తామని అన్నారు. నా కుమారుడు ఒమర్ అబ్దుల్లా జైలులో ఉన్నాడు. వారు మమ్మల్ని చంపాలని చూస్తున్నారని కేంద్రంపై ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు.