telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ కు కౌలు రైతుల సంఘం లేఖ!

ఏపీ సీఎం జగన్ కు కౌలు రైతుల సంఘం బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని లేఖలో కోరింది. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు, కార్యదర్శి పి.జమలయ్య తెలిపారు. అన్ని ప్రాంతాలు, పంటల విషయంలో కౌలు వ్యవసాయం విస్తరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం కౌలు ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ, వడ్డీల భారంతో కౌలు రైతులు కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కౌలు రైతులను ఆదుకోవాలన్న ప్రస్తావనే ఉండటం లేదని గుర్తుచేశారు. పంట రుణాల జారీ సందర్భంగా కూడా కౌలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. గతంలో జరిగిన రుణమాఫీలో కౌలురైతులు దగాపడ్డారని తెలిపారు. కౌలు రైతుల రక్షణ, సంక్షేమం జరగాలన్నా, వ్యవసాయం లాభసాటిగా మార్చాలన్నా కౌలు రైతులను పట్టించుకోవాలని స్పష్టం చేశారు.

Related posts