పసుపు, ఎర్రజొన్న గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కి పోరాడినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో తమ నిరసనను తెలిపేందుకు బ్యాలెట్ పోరుకు అన్నదాతలు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 500 మంది పోటీకి సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జగిత్యాల జిల్లాల రైతులు సోమవారం నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు.
నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 500 నుంచి వెయ్యి మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని రైతు సంఘాలు తీర్మానించాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల అంశంపై తీర్మానాలు చేశారు.