ఏపీలోని అనంతపురం జిల్లాలో రైతులు విత్తనాల కోసం రోడ్డెక్కారు. గుంతకల్కు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో గంటర్నరపాటు రాకపోకలు నిలిచి పోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడంలేదని భారీ సంఖ్యలో అన్నదాతలు నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయ పనులను ఒదిలిపెట్టి విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
అయినప్పటికి విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదని రైతులు మండిపడుతున్నారు. విత్తనాలు వేయడానికి అదునుదాటిపోతోందని ఇంకెప్పుడు ఇస్తారని రైతులు నిలదీస్తున్నారు. అధికారులు నామమాత్రంగా విత్తనాలు పంపిణి చేసి చేతులు దులుపుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాల్లో విత్తనాలు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు.