భారతీయ రైల్వే, ఫొని తుపాను ప్రభావంతో తాము 89 రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది. గత రెండు రోజులుగా ఈ రైళ్లను రద్దు చేశామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మూడు రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది. రైళ్ల రద్దు దృష్ట్యా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు నిర్దేశిత సమయంలోపు క్యాన్సిల్ చేసుకుంటే వంద శాతం సొమ్ము రీఫండ్ చేస్తామని వెల్లడించింది.
భారత రైల్వే రద్దుచేసిన రైళ్లలో .. హౌరా-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, పట్నా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్, దిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్, హౌరా-హైదరాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్-రామేశ్వరం ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. గురువారం బయలు దేరాల్సిన దిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్, దిల్లీ-పూరీ నందన్కనన్ ఎక్స్ప్రెస్, పూరీ-దిల్లీ పురుషోత్తం ఎక్స్ప్రెస్లను సైతం నిలిపేసినట్లు ప్రకటించింది. రద్దైన రైళ్లకు సంబంధించిన వివరాలను అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వినిపించేలా ప్రకటనలు ఇవ్వాలని సంబంధిత డివిజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక రైళ్లలో ఒకటైన పూరి-షాలిమార్ (కోల్కతా), మరో రెండు రైళ్లు పూరి-హౌరా మధ్య నడుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా ప్రధాన స్టేషన్లలోని క్యాటరింగ్ స్టాళ్లలో ‘జనతా ఖానా’ పేరుతో ఆహార పొట్లాలు, నీళ్ల సీసాలు అందుబాటులో ఉంచాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.