విపత్తుల నిర్వహణ శాఖ సెక్రటరీ వరప్రసాద్ తుపాను గమనంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. సోమవారం ఆయన కేబినెట్ సెక్రటరీ, విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. నాన్ మెకానికల్ బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయని.. వాటిని కూడా వెనక్కి రప్పిస్తున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మాక్ డ్రిల్ చేస్తున్నారన్నారు.
ఫణి తీరం దాటి గత తుఫానుల మాదిరి భూభాగం మీదకి వచ్చే అవకాశం లేదని వరప్రసాద్ స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చన్నారు. దీనిపై రేపు మధ్యాహ్నానికి ఒక అంచనా వస్తుందన్నారు. ఫణి తుపానుపై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రబీలో రైతులు ఎంఎస్పీ రూ.1750కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. ఎవరైనా ధర తగ్గిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.