సెంట్రల్ ప్యారిస్లోని ర్యూ సెయింట్ హానోర్లోని ఒక విలాసవంతమైన నగల దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలు ఆభరణాల వ్యాపారిని మాటల్లో పెట్టి నగలతో ఉడాయించారు. ఈ ఘటన జూలై 31న చోటుచేసుకుంది. షాపుకు వచ్చి ఇద్దరు మహిళల్లో ఒకరు తాను యూఏఈ ప్రిన్సెస్ అంటూ యజమానిని మాటల్లో పెట్టింది. తనకు విలువైన జువెలరీ చూపించాలని కోరింది. దాంతో ఆమె ముందు ఆ షాపులో ఉన్న అత్యంత ఖరీదైన ఆభరణాలను తీసుకొచ్చి పెట్టారు. వాటిలోంచి ఆమెకు కావాల్సిన కొన్ని విలువైన నగలను సెలెక్ట్ చేసుకున్న సదరు మహిళ వాటిని ఓ పెట్టెలో ఉంచమని చెప్పింది. అదే సమయంలో నగల తాలూకు బిల్లు చెల్లించేందుకు ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటించి ఆభరణాల పెట్టెలోని నగలను మార్చేసింది. ఆ తరువాత తమకు డబ్బులు రావడం ఆలస్యమవుతుందని చెప్పి ఆమెతో పాటు వచ్చి మరో మహిళతో కలిసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. వాటి విలువ రూ.12 కోట్ల 85 లక్షలు. వారు వెళ్లిపోయిన తర్వాత యజమాని ఆభరణాల పెట్టెను ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. అందులో నగల బదులు స్టాక్ క్యూబ్స్ కనిపించాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో గురువారం పోలీసులకు నగర శివార్లలోని సీన్-సెయింట్-డెనిస్లో గల ఓ హోటల్ రూంలో ఖరీదైన నగలు ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దోపిడీకి పాల్పడిన ఆ ఇద్దరు మహిళలు మాత్రం దొరకలేదని పోలీసులు వెల్లడించారు.
previous post
మా ప్రెసిడెంట్ని నాకూ ఏం చెప్పలేదు… బాలయ్య వ్యాఖ్యలపై నరేష్ రియాక్షన్