ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. కర్నూలు జిల్లాలో ఏడుగురిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ రోజు దాడికి దిగడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాడికి గురైన బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని కోసిగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిమ్మయ్య అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారిపై అనుమేశ్ అనే వ్యక్తి కుటుంబీకులు దాడి చేసినట్టు తెలుస్తోంది.
దాడి విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు కుటుంబాల మధ్యా గొర్రెల విషయంలో వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.