కేంద్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ డెమోక్రసీ’ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రధాని అయ్యే అవకాశం లేని రాహుల్.. ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని ఉండవల్లి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. ప్రత్యేక హోదా ఇస్తారు అని చెబుతున్నారు.. అదెలా సాధ్యమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు 150 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 250 స్థానాలు వస్తేనే కానీ ప్రధాని కాలేరని అన్నారు. ఏ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు హోదా ఎలా ఇవ్వగలుగుతారు? అని ప్రశ్నించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్లో ఏడు మండలాలను విలీనం చేసిన ఘనత తనదేనని చంద్రబాబు చెబుతున్నారు. అసలు భద్రాచలమే మనది, దానిని తప్పించి 7 మండలాలు విలీనం చేస్తే ఘనత ఏంటి? చంద్రబాబు ప్రసంగం వింటే హాయిగా నిద్రవస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్గా ఆయన ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోవచ్చని ఉండవల్లి ఎద్దేవా చేశారు.