సుమారు 15 ఏళ్లుగా టీవీ9 సీఈవోగా పనిచేసిన రవిప్రకాష్ను కొత్తయాజమాన్యం తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కన్నడ టీవీ9కి ఎడిటర్, సీఈవోగా పనిచేసిన మహింద్రా మిశ్రాను, సీఓఓగా గొట్టిపాటి సింగారావును కొత్తయాజమాన్యం నియమించింది. ఈ నేపథ్యంలో రవిప్రకాష్ బహిరంగ లేఖ రాశారు.
రవిప్రకాష్ బహిరంగ లేఖ :
విషయం: టీవీ9 గ్రూప్ ఛానల్స్ సిఈఓ పదవి నుంచి రాజీనామా, తప్పుడు కేసులు బనాయించడం, యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన…
“నేను.. రవిప్రకాష్.. టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే టీవీ9 పని పట్టాలని ఈ చర్యలకు దిగారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ9 సంస్థలోకి జొరబడ్డారు. ఎన్సిఎల్టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ9ని కంట్రోల్లోకి తీసుకున్నారు. తప్పుడు కంప్లయింట్స్తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు. పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు. మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది” అని రవిప్రకాష్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై కొత్త యాజమాన్యం అలంద మీడియా ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.