నిజామాబాద్ లోక్ సభ పరిధిలోకి వచ్చే జగిత్యాలలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఆటోల్లో ఈవీఎంలను తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై జగిత్యాల ఆర్డీవో మాట్లాడుతూ, ఇవి గ్రామాల్లో అవగాహన కోసం వాడిన పాత ఈవీఎంలు అని చెప్పారు. పాత స్ట్రాంగ్ రూమ్ కు వీటిని తరలించామని వివరణ ఇచ్చారు.
మరోవైపు, ఇవి పాత ఈవీఎంలు అయినప్పుడు అర్ధరాత్రి పూట వాటిని తరలించాల్సిన అవసరమేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పగటి పూట తరలించవచ్చు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున కవిత ఎన్నికల బరిలో ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా 185 మంది నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.