ఈఎస్ఐ ఆసుపత్రి మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. రూ.50 లక్షలకు తప్పుడు బిల్లులు తయారుచేసి పంపాలంటూ డాక్టర్ను సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఆదేశించిన ఆడియో టేపులు బయటకొచ్చాయి. సెక్షన్ అధికారి తనపై ఒత్తిడి తెచ్చినప్పటికీ సదరు డాక్టర్ మాత్రం అందుకు నిరాకరించారు.
తాను నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తానని డాక్టర్ చెప్పడంతో సురేంద్రనాథ్ బెదిరింపులకు గురిచేశాడు. మరో మహిళా అధికారిని కూడా సురేంద్రనాథ్ ఫోన్ చేసి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ అండ్ జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని సురేంద్రనాథ్ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆమె మాత్రం తన వల్ల కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.