ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదు ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను, రూ. 41.75 లక్షల జరిమానాను విధించింది. సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. 2010లో ఈ విషయానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. మొత్తం రూ. 48 లక్షల చౌక్ బౌన్స్ కు సంబంధించి కోర్టును వైవీఎస్ ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
బాధితుడికి కోర్టు ఆదేశాల మేరకు జరిమానాగా రూ.41.75 లక్షలు చెల్లించకపోతే మరో మూడు మాసాల పాటు జైలు శిక్షను పొడిగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం నాడు ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డిజ వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు. ఇదిలా ఉంటే నటుడు మోహన్ బాబు ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ స్పందించలేదు. మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ విషయంపై స్పందిస్తేగానీ స్పష్టత రాదు.