తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రి మండలి తీర్మానాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కొత్త అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్ లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై న్యాయస్థానం ఈరోజు సుదీర్ఘ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తీర్పు వెలువరించింది.
కొత్త అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్ లోని పాత భవనాలను కూల్చొద్దని ఆదేశించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని ఆదేశించింది.కాగా, ఎర్రమంజిల్ లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీని నిర్మాణం నిమిత్తం జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.