లాక్ డౌన్ తో తెలంగాణలో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కల్లు కాంపౌండ్ లు, మద్యం షాపులు మూత పడటంతో మందుకు అలవాటు పడిన ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. వందలాది మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు పోటెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజే ఆసుపత్రికి 94 మందిని చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. వీరందరికీ వెంటనే చికిత్సను అందించకుంటే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాగా, గడచిన పది రోజులుగా మద్యం షాపులు, కల్లు కాంపౌండ్ లూ మూత పడిన సంగతి తెలిసిందే. నిత్యం మద్యం సేవించేవారు.. మందు దొరకక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అధెవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 మంది ఆత్మహత్యలు చేసుకోగా, మరో 20 మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మద్యం, కల్లు దొరకకనే పలువురు వింతగా ప్రవర్తిస్తున్నారని ఎర్రగడ్డ మానసిక వైద్యులు అంటున్నారు.