ఇటీవల కేరళలోని ఎర్నాకుళంలో నిఫా ప్రభావం పడిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిస్థితి నుండి ఆ ప్రాంతం ఇప్పటికి పూర్తిగా కోలుకున్నట్టు, దానితోనే ఆ ప్రాంతాన్ని నిఫా రహిత జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది. ప్రాణాంతక వైరస్ నిఫాతో రెండు నెలల క్రితం చేరిన వ్యక్తికి అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత వైరస్ ప్రభావం లేదని తేలడంతో అతనిని విడుదల చేశారు. దీంతో ఎర్నాకుళంను నిఫా రహిత జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ మాట్లాడుతూ నిఫా వైరస్ను తరిమి కొట్టడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య విభాగాలు విజయవంతంగా కృషి చేశాయన్నారు. వైరస్ విస్తరించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నదన్నారు. దాదాపు 338 మంది నిఫా వైరస్ గ్రస్తులను ఆరోగ్య శాఖ తన పర్యవేక్షణలో ఉంచింది. అందులో 17 మందిని వేరుగా కలమసెరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచింది. ఈ వ్యాధిని నివారించడంలో కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు.