ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అభిమానుల అశృనయనాల మధ్య బుధవారం సాయంత్రం ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల చితికి ఆయన తనయుడు శివరామ్ నిప్పు అంటించారు. తండ్రి మృతదేహానికి కొరివి పెడుతూ శివరామ్ కన్నీరుమున్నీరుగా విలపించారు.
అంతకుముందు రాజాగారితోటలో ఉన్న కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. శివప్రసాదరావు పార్థివదేహం వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పేటలోని ప్రధాన వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.