మనిషి అవసరాలకు మించి వనరులను ఇష్టానికి వాడేస్తున్నాడు.. దీనితో ఒకపక్క వనరులు తరువాత తరానికి కరువు వచ్చేట్టుగా నిండుకుంటున్నాయి, మరోవైపు అడవులు తగ్గిపోతుండటంతో అందులో నివాసం ఉంటూ, అక్కడ దొరికే ఆహారాన్ని తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చే జంతుజాలానికి నిలువ నీడే కాదు, ఆహార కొరత కూడా తీవ్రంగా ఏర్పడుతుంది. దీనితో ఇప్పటికే చాలా చోట్ల ఆ జంతుజాలం జనజీవనం లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అలాంటి సందర్భమే ఒకటి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎంత ఆకలితో ఉందో ఏమో… ఓ గజరాజు ఆశగా రెస్టారెంట్ కు వచ్చింది.
ఆహార పదార్థాలు ఏమైనా దొరుకుతాయేమోనని ఆశగా చూసింది. ఏమీ దొరకలేదు. ఆ సమయంలో ఏనుగులు ఆగ్రహంతో నానాయాగీ చేసి బీభత్సం చేస్తాయి. కానీ, ఈ ఏనుగు మాత్రం ప్రశాంతంగా వెనుదిరిగింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరుగగా, ఏనుగు వచ్చి, ఆహారం కోసం వెతికి, నిరాశతో వెనుదిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కి వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో 50కి పైగా ఏనుగులు సంచరిస్తున్నాయని, అడవుల్లో ఆహారం లభించక జనావాసాల్లోకి నిత్యమూ వస్తున్నాయని రెస్టారెంట్ వర్గాలు వెల్లడించాయి.