కేంద్ర ఎన్నికల సంఘం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యర్థులకు ఆటంకం కలిగేలా సభలు, సమావేశాలు నిర్వహించడం, అధికారుల విధులు తదితర అంశాలపై చట్టాలను రూపొందించింది. అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిబంధనలను అతిక్రమించకుండా చట్టాలను పాటించాల్సి ఉంటుంది. చట్టాలను అతిక్రమిస్తే జైలు శిక్షతో పాటు జరిమానాను విధించేలా చట్టంలో పొందుపర్చారు. ఎన్నికల చట్టాలపై అప్రత్తంగా ఉండాలని కేంద్రం ఎన్నికల సంఘం సూచిస్తున్నది. ఎన్నికల చట్టం అతిక్రమించినవారు శిక్షలకు అర్హులవుతారు. ఒక్కోసారి ఎన్నికలలో పోటీచేసే అవకాశాలను కోల్పోయి జైలుశిక్షతో పాటు జరిమానాలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఆ నియమావళి ..
* కుల, మతాల పేర్లతో ప్రచారాలు చేయరాదు.
కులాలు, మతాలు, భాషాల ప్రాతిపాదికన విద్వేషాలను రగిల్చేలా చర్యలు ప్రయత్నిస్తే 123వ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారు. ప్రజల మధ్య శత్రుత్వ భావాలను పెంపొందించినట్లయితే మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రెండింటిని కూడా అమలు చేస్తారు.
* అల్లర్లకు పాల్పడితే 6 నెలల జైలుశిక్ష.
ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడితే 42 సీఆర్పీసీ ప్రకారం 6 నెలల జైలుశిక్ష లేదా రూ.2వేల జరిమానాను విధిస్తారు. అల్లర్లను తీవ్ర స్థాయిలో ప్రోత్సహించే వారికి ఏకకాలంలో ఈ రెండింటిని కూడా అమలు చేసే అవకాశం ఉంది.
* చిరునామా లేకుండా కరపత్రాలు ముద్రించొద్దు.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు లేదా ఇతరులు, ఆయా సంస్థల వారు తమ చిరునామా, వివరాలు లేకుండా కరపత్రాలు, వాల్పోస్టర్లు ముద్రిస్తే ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలు, వాల్పోస్టర్లను ముద్రించే వారికి యాక్ట్ నెం.127 ప్రకారం 2 నెలల జైలుశిక్ష లేదా రూ.2వేల జరిమానాను విధిస్తారు. ఒక్కోసారి రెండింటినీ కూడా అమలు చేస్తారు.
* బహిరంగంగా ఓటు వేయడం తప్పే.
ఎన్నికల సమయాలలో కొంతమంది తమ ఓట్లను బహిరంగంగా వేస్తారు. ఇలా వేయడాన్ని యాక్ట్ 128 ప్రకారం ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. బహిరంగంగా ఓట్లు వేశారని నిరూపణ అయితే 3 నెలల జైలుశిక్షతో పాటు జరిమానను విధించే అవకాశాలు ఉంటాయి.
* పోలింగ్ బూత్కు సమీపంలో ప్రచారం చేయొద్దు.
పోలింగ్ బూత్లకు సమీపంలో నిబంధనల ప్రకారం ప్రచారం చేయరాదు. పోలింగ్ బూత్కు 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తే యాక్ట్ నెం.130 ప్రకారం జరిమానా విధిస్తారు. ప్రచార సామాగ్రితో పట్టుబడితే 3 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. పరిస్థితులను బట్టి ఈ రెండు శిక్షలను అమలు చేయడానికి అవకాశం ఉం టుంది. ఓటర్లను వాహనాల ద్వారా పోలింగ్ బూత్కు తీసుకువస్తే 133వ చట్టం ప్రకారం 3 నెలల జైలుశిక్ష, జరిమానా లేదా రెండింటినీ విధిస్తారు.
* అధికార దుర్వినియోగానికి పాల్పడితే.
ఎన్నికలు జరిగే సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. చట్టం 135-అ ప్రకారం జైలుశిక్ష లేదా రూ.500 జరిమానా విధిస్తారు. ఒక్కొక్కసారి రెండింటిని విధించే అవకాశాలుంటాయి. ఎన్నికలు నిర్వహించాల్సిన సిబ్బందికి ఎన్నికల రోజున సెలవును మంజూరు చేస్తే యాక్ట్ -135 ఆ ప్రకారం రూ.5000 జరిమానా విధిస్తారు.
* మద్యం విక్రయాలు జరిగితే 6 నెలల జైలుశిక్ష.
పోలింగ్ రోజున, ఓట్ల లెక్కింపు రోజున మద్యం అమ్మకాలు నిర్వహించొద్దు. ఒకవేళ మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు చేస్తే యాక్ట్ 135 ఈ ప్రకారం 6 నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానాను విధిస్తారు.
* ఎన్నికలకు 48 గంటల ముందు సభలు బంద్.
ఎన్నికలు నిర్వహించడానికి 48 గంటల ముందు బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టం 126 ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష, జరిమానాను విధిస్తారు. పరిస్థితుల తీవ్రతను బట్టి రెండింటిని విధించే అవకాశం ఉంటుంది. ఎన్నికల చట్టాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.