సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చిత్రానికి ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికల సంఘం ముందు రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు. ఒకవైపు తెలుగుదేశం నేతలు ఈ చిత్రం విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు అడ్డుపోవాలని ప్రయత్నిస్తుండగా… మరోవైపు వర్మ సరికొత్తగా తనదైన స్టయిల్లో సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైకోర్ట్ నుంచి కూడా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి సినిమా విడుదల తరువాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయా సన్నివేశాలను తొలగించాలని ఆదేశిస్తామని ముందుగా చెప్పిన ఈసీ ఇప్పుడు ముందుగా తమకు సినిమా ప్రివ్యూను చూపించాలనడం గమనార్హం.