పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నిందితులు ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. తాజాగా పులివెందుల కార్యాలయంలో డీఎస్పీ వాసుదేవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకా హత్య కేసు తమకు పెను సవాలుగా మారిందన్నారు. .సిట్ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిందని, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 23 మంది ఎస్ఐలు ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నారని వివరించారు.
ఈ కేసులో ప్రజలకు గానీ, పోలీసు సిబ్బందికి కానీ ఎలాంటి సమాచారం తెలిసినా తమతో పంచుకోవాలని, సరైన ఆధారాలతో సమాచారం అందించినవారికి ఊహించని నజరానా ఉంటుందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన కీలక వివరాలు అందించన వారి సమాచారం రహస్యంగా ఉంచుతామని డీఎస్పీ పేర్కొన్నారు.