అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చల్లో పాలగొన్నారు. అనంతరం మోదీని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని భారత జాతిపితగా అభివర్ణించారు. మోదీ చాలా పెద్ద మనిషి అని, గొప్ప నాయకుడని పేర్కొన్న ట్రంప్ ఆయనంటే తనకెంతో గౌరవమని అన్నారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన భారత్ను ఆయన ఏకం చేశారని తెలిపారు. ఓ తండ్రిలా మోదీ అందరినీ దరిచేర్చారని ప్రశంసించారు.
ఇక నుంచి ఆయనను తాము భారత జాతిపిత (ఫాదర్ ఆఫ్ ఇండియా) గా పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రముఖ పాప్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీకి ఉన్నంత ప్రజాదరణ మోదీకి ఉందంటూ ఆకాశానికెత్తేశారు. కశ్మీర్ అంశం విషయంలో మోదీ, ఇమ్రాన్ కలిసి ఏదో ఒకటి తేల్చుకుంటారని విశ్వసిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.