ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రోగుల నుంచి భద్రత కలిపించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలు జరపడానికి తాము సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే చర్చావేదిక ఎక్కడనేది గవర్నింగ్ బాడీలో చర్చించి తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆందోళన జరుగుతున్న ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ను సీఎం మమతా బెనర్జీ సందర్శించాలని వారు కోరుతున్నారు.
వైద్యులతో చర్చలు విఫలమైన అనంతరం సీఎం మమత మాట్లాడుతూ డాక్టర్ల డిమాండ్కు ప్రభుత్వం ఒప్పుకుంటుందనీ, వారు వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. అలాగే వారిమీద ఎలాంటి చట్టాలను ప్రయోగించబోమనీ పేర్కొన్నారు. ఈ విషయంపై బెంగాల్ గవర్నర్ కె.ఎన్.త్రిపాఠి వైద్యుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు డాక్టర్ల ఆందోళన విషయంలో ఆదేశాలు జారీచేయడానికి హైకోర్టు నిరాకరించింది.