తెలంగాణలో కాంగ్రెస్ కనిపించకుండా పోయేట్టుగా ఉంది అనే వార్తలు వస్తున్నప్పటికీ, అవి తెరాస వలన సాధ్యపడకపోవచ్చు అనుకుంటున్నవేళ, బీజేపీ ముందుకు రావడం విశేషం. మొత్తానికి ఈ రెండు పార్టీలు కలిసి, టి.కాంగ్రెస్ బోర్డు తిప్పేశాయి. తాజాగా, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆమె కాంగ్రెస్ను వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చొరవతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా, అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అరుణ టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అరుణ అనూహ్య నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరడం సొంతపార్టీ నేతలను కలవరపరుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆమె మహబూబ్నగర్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్టు సమాచారం.