దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సైబరాబాద్ ఏసీపీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో జరిగింది. చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య అలియాస్ కూర్మప్ప స్వగ్రామమైన గుడిగుండ్ల నుంచి బండిపై వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కూర్మయ్యను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉన్నత వైద్యం కోసం అతన్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.