దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే తెలంగాణ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు(శనివారం) ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల బృందం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి రానుంది. అక్కడ ఎన్కౌంటర్లోని మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాతే వారి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు కోరితే.. నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టమ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారమే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. ఓవైపు నిందితుల మృతదేహాలకు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టమ్ జరుగుతుండగా.. మరోవైపు వారి స్వగ్రామంలో అంత్యక్రియలు పోలీసులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో పోలీసులు అంత్యక్రియలను రేపు సాయంత్రం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో నిందితులు మృతదేహాలను ఈ రాత్రికి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోనే ఉంచనున్నారు.