ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 350కి పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ వసూళ్ళు సాధించడం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఇక బాలీవుడ్లో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించి వంద కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే అన్ని భాషల్లోనూ సమీక్షకులు “సాహో”కు తక్కువ రేటింగే ఇచ్చారు. సమీక్షల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుజిత్ స్పందించాడు. “విమర్శకులంటే నాకు చాలా గౌరవం ఉంది. నా తొలి సినిమా “రన్ రాజా రన్” గురించి చాలా బాగా రాశారు. అయితే “సాహో” విషయంలో తొందరపడ్డారేమో అనిపిస్తోంది. పెద్ద సినిమాలకు తొందరపడకుండా ఒక పూట ఆగి రివ్యూలు ఇస్తే మంచిది. ప్రేక్షకులకు ఆలోచించుకునే సమయం దొరుకుతుంది. ఇప్పటి ప్రేక్షకులు రివ్యూలకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు” అని సుజిత్ అన్నాడు.